bengaluru: కండక్టర్ రూ. 5 చిల్లర ఇవ్వలేదని సోషల్ మీడియాకెక్కిన యువకుడు

  • బెంగళూరులో ఘటన.. ‘ఎక్స్’ వేదికగా ఆవేదన
  • బస్సుల్లో చిల్లర కష్టాలపై నెటిజన్ల కామెంట్స్
  • స్పందించిన బస్సు యాజమాన్యం.. ఫిర్యాదు స్వీకరించినట్లు వెల్లడి
Bengaluru Bus Rider Complains About Not Getting change

బస్సులో టికెట్ తీసుకున్నాక కండక్టర్ చిల్లర ఇవ్వలేదంటూ బెంగళూరులో ఓ యువకుడు సోషల్ మీడియాకెక్కడం వైరల్ గా మారింది. అలాగే ప్రయాణికుల చిల్లర కష్టాలపై చర్చకు తెరలేపింది. ఈ విషయంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని నితిన్ కృష్ణా అనే యువకుడు సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా పంచుకున్నాడు. తాను ప్రయాణించిన బీఎంటీసీ బస్సు టికెట్ ను తన పోస్ట్ లో షేర్ చేశాడు. 

పరిష్కారం ఉందా?
“కండక్టర్ దగ్గర రూపాయి కూడా చిల్లర లేకపోవడం వల్ల టికెట్ చార్జీపై నేను నా 5 రూపాయలను కోల్పోయా. దీనికి ఏమైనా పరిష్కారం ఉందా” అని అతను ప్రశ్నించాడు. అలాగే మరో పోస్టులో అతను స్పందిస్తూ “నేను ప్రతిసారీ ఇలా డబ్బు కోల్పోవాలా? బస్సు ట్రిప్ ప్రారంభానికి ముందే కండక్టర్ల వద్ద తగిన చిల్లర ఉండేలా అధికారులు చూడాలి. లేకపోతే ఆన్ లైన్ చెల్లింపులకు వీలు కల్పించేలా బస్సుల్లో టెక్నాలజీని వాడాలి” అని సూచించాడు. అతని ఫిర్యాదుపై బీఎంటీసీ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతా ద్వారా స్పందించింది. ‘మీ ఫిర్యాదును బీఎంటీసీ2024003258 అనే నంబర్ తో రిజిస్టర్ చేశాం’ అని ప్రకటన విడుదల చేసింది.

నెటిజన్ల రియాక్షన్..
నితిన్ కృష్ణ పోస్ట్ వైరల్ గా మారింది. అతని పోస్ట్ కు 72 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. అలాగే ఈ అంశం ఆన్ లైన్ చర్చకు దారితీసింది. ప్రయాణికులు, కండక్టర్లకు ఇబ్బంది లేకుండా ఉండాలంటే బస్సుల్లో ప్రయాణించేటప్పుడు టికెట్ చార్జీకి తగిన చిల్లర తీసుకెళ్లాలని కొందరు యూజర్లు సూచించారు. ఒక యూజర్ మాత్రం భిన్నంగా స్పందించాడు. ‘ఆన్ లైన్ లో చెల్లించు.. సోషల్ మీడియా ద్వారా ఏడవడం ఆపేయ్’ అంటూ కామెంట్ చేశాడు. 

మరో యూజర్ స్పందిస్తూ “ఇది తరచూ ఎదురయ్యే అనుభవమే. మెట్రో స్టేషన్లలోనూ ఈ సమస్య ఎదురవుతుంది. బ్లాక్ మనీ సృష్టికి దారితీస్తుంది. చిల్లర లేకపోతే ఏదైనా వోచర్ పద్ధతిని ప్రవేశపెట్టాలి. తర్వాతి ప్రయాణంలో అంత మొత్తాన్ని టికెట్ చార్జీ నుంచి మినహాయించాలి. లేకపోతే వాటికి డిపోలలో నగదు చెల్లించాలి” అని సూచించాడు. “నాన్ ఏసీ బస్సుల్లో యూపీఐ చెల్లింపులకు వీలు కల్పించేందుకు బీఎంటీసీకి ఉన్న అడ్డంకి ఏమిటి? ఇది చిల్లర సమస్యల్లో చాలా వాటిని పరిష్కరిస్తుంది. బీఎంటీసీ అధికారుల లోపభూయిష్ట పనితీరు వల్ల కండక్టర్లు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు” అని మరో యూజర్ వ్యాఖ్యానించాడు.

More Telugu News